Translate

Friday, 17 July 2015

వైమానిక శాస్త్రం



వేదములలో విజ్ఞానమంతా సూత్రప్రాయమే అని దానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని నేటి శాస్త్రవేత్తల వాదన. అయితే 50 నుండి 60కోట్ల సంవత్సరాలకు పూర్వమే మన మహర్షులు వేదములందలి సారమును అనేక విధములుగా గ్రహించి, గ్రంథస్థం చేయడమే కాక వినిమయం గావించారు. మన పురాణగాథల్లో ఉన్న ఎన్నో వైజ్ఞానిక ప్రస్తావనలు కల్పితాలో, ఊహలో కావు. అవి అన్నీ సాంకేతికంగా ఆనాడు ఉపయోగింపబడినవే.
ధృతరాష్ట్రుని వీర్యాన్ని 100 కుండల్లో భద్రపరిచి, కౌరవసంతానంగా రూపుదిద్దిన శ్రీవ్యాసమహర్షి వాడిన సాంకేతిక పరిజ్ఞానం నేటి టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ ఒకటే. సూర్యునిద్వారా కుంతీదేవి కర్ణుని కన్న వైనం, నేటి ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ కాదా! ఆనాటి మాయాదర్పణం నేటి టి.వి.... ఇలా చెప్పుకుంటూపోతే ముఖ్యమైనది పుష్పకవిమానం. రామాయణకాలంలోనే విమాన ప్రస్తావనలు కలవు.
భరద్వాజ మహర్షి రాసిన 'యంత్రసర్వస్వము' అనే ఉద్గ్రంథములోని 40 అధికరణమైన 'వైమానిక ప్రకరణము'లో ఆనాటి పనిముట్లు, యంత్రముల చిత్రాలేకాక విమాన డిజైన్ లు కూడా పొందుపరిచారు. దాదాపు 600 పేజీలతో వైమానిక శాస్త్రము రూపుదాల్చింది. ఇది తొలి వైజ్ఞానిక గ్రంథము.
భరద్వాజ మహర్షి పేర్కొన్న వైమానికశాస్త్రంలో యంత్రాలు, పరికరాలు, లోహాల వినియోగం, వాటి నిర్వహణపై పరిశోధనలు జరిపి తెలుగులో గ్రంథంగా రూపొందించారు డాక్టర్ ఆమంచి బాలసుధాకరశాస్త్రి. అందులో పైలట్ తెలుసుకోవలసిన 32 రహస్యాల గురించి వివరించారు. పైలెట్స్ తీసుకోవలసిన శిక్షణ ఎలా ఉండాలనేది కూడా భరద్వాజ మహర్షి చెప్పారు.
విమానంలో ముఖ్యమైన 32 భాగాల గురించి, ఆ యంత్రాల పనితీరు గురించి విపులంగా చెప్పారు. ఇది నేటి టెక్నాలజీ కంటే చాలా అధునాతనమైనదని, ఇప్పుడు విమానంలో తీసుకుంటున్న న్యూట్రిషియన్ టాబ్లెట్స్ వంటివి ఆ కాలంలోనే ఉన్నవని భరద్వాజ మహర్షి తెలియచేశారు. వంద శతఘ్నులు పేల్చినా దెబ్బతినని లోహాన్ని ఆనాటి విమానాల తయారీకి వాడేవారు. మెరుపులలో నుంచి ఎనర్జీ తీసుకోవచ్చని వైమానిక శాస్త్రంలో చేర్చబడింది. నేల మీద, నీటిమీద, ఆకాశంలో సంచరించగలిగే త్రిపుర విమానం గురించి కూడా పేర్కొన్నారు.
ఈనాటి ఏరోనాటిక్స్ లో ఉన్న యంత్రసర్వస్వమంతా వైమానికశాస్త్ర గ్రంథంలో ఉంది. విమానసిబ్బంది ఎటువంటి వస్త్రాలను ధరించాలో వివరించారు. ఆహారాధికరణంలో ఎటువంటి ఆహారాన్ని స్వీకరించాలి, లోహాధికరణంలో విమానాల తయారీలో ఉపయోగించే వివిద రకాల లోహాలు, అద్దాలు, లెన్స్ లు, పవర్ జనరేషన్ ఎట్లా చేయాలి వంటి అనేక అంశాలు స్పష్టంగా భరద్వాజ మహర్షి తెలియచేశారు. ఈ మధ్యకాలంలో ఎన్నో సంస్థలు, ఎందరో వ్యక్తులు వేదవిజ్ఞాన పరిశోధనా ప్రయత్నాలు ప్రారంభించి మధ్యలోనే ఆగిపోతున్నారు. తగిన ఆధారగ్రంథాలు లేకపోవడం, వసతుల కొరత, ప్రభుత్వాలకు, అధికారులకు ఇవేమి పట్టకపోవటం, పండితుల మధ్య సమన్వయం కొరవడడం దీనికి కారణం. ఎంతోకాలాన్ని కోట్లరూపాయల ధనాన్ని ఆధునిక పరిశోధనలకి వెచ్చిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందులో వెయ్యోవంతు ప్రయత్నం... ఇందుకోసం వెచ్చిస్తే మానవాళికి పనికొచ్చే ఎన్నో ఆవిష్కరణలు, నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో దుష్పరిమాణాలకి పరిష్కారాలు దొరకకపోవు.
వేదమనగా మతం కాదని, అది ఒక అద్భుతవిజ్ఞాన భాండాగారమని, విశ్వమానవ జీవనశైలి అని గుర్తించిన ప్రపంచ దేశాలన్నీ వేద విజ్ఞాన పరిశోధనా ఫలములను అందిపుచ్చుకోవడంలో చాలా ముందుకు వెళుతుండగా, వేదాలకు పుట్టినిల్లయిన భారతదేశంలో ఈ పరిస్థితులు ఉండడాన్ని 'ఫ్రాంటెయర్ గాటెయర్' అనే అమెరికన్ 'ఓ భారతదేశమా రోదించు!' అనే వ్యాసంలో పేర్కొన్నారు. భారతీయ విజ్ఞాన వాఙ్మయ సంపదంతా జర్మనీలో ఉంది. అలాగే బ్రిటీషువారు వెళుతూ వారి భావాల్ని వారి విద్యావిధానాన్ని (మెకాలే), వారి జీవనశైలిని, భారతీయులకిచ్చి, భారతీయ వైజ్ఞానిక గ్రంథ సంపదని వారు తీసుకొని పోయి బ్రిటీషు లైబ్రరీలో భద్రపరిచారు. జర్మనీతరువాత గ్రంథాల చిరునామా బ్రిటీష్ లైబ్రరీనే.
1920 ప్రాంతంలో జర్మనీలో పుట్టిన ప్రతి జర్మన్ విధిగా సంస్కృతాన్ని అభ్యసించాలని ప్రభుత్వం శాసనం చేసింది. 1927వ సంవత్సరంలో వేదవాఙ్మయ కేటలాగ్ జర్మనీలో ప్రింట్ అయింది. వైమానిక శాస్త్రం ఒక నిర్దుష్టమైన ఇంజనీరింగ్ టెక్ట్స్ బుక్, 8 అధ్యాయాలలో 100 అధికరణాలలో 500 సూత్రాలతో "విమాన నిర్మాణము”ను సమగ్రంగా అందించిన ఒక అద్భుత ప్రాచీన వైజ్ఞానిక సత్యం. ఊహలే తప్ప ఆధారాలు లేవనే వాదానికి ఇక స్వస్తి పలకవచ్చు. ఈ ఒక్క తీగతో సనాతన ఋషిప్రోక్త విజ్ఞాన కోశానికి దారి వెదకవచ్చు. 




No comments:

Post a Comment